చెయిన్ స్నాచింగ్లకు పాల్పడడం దొంగలకు కొత్తేమీ కాదు. వారు అవలీలగా ఆ పని చేస్తుంటారు. నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా మహిళ కనిపిస్తే బైక్ మీద వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని వెళ్తారు. అయితే ఆ దొంగలు కూడా అలాగే చేయబోయారు. కానీ వారిలో ఒక వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అయితే అప్పటికే అతను ఆ గొలుసును మింగేశాడు. దీంతో పోలీసులు చాకచక్యంగా ఆ గొలుసును బయటకు తీశారు.
బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ప్రాంతంలో ఎంటీ స్ట్రీట్లో రాత్రి 8.50 గంటల ప్రాంతంలో హేమ అనే మహిళ రహదారిపై వెళ్తోంది. అయితే ఆమె దగ్గరకు వచ్చిన ముగ్గురు దొంగలు ఆమె మెడలో ఉన్న 70 గ్రాముల బంగారు గొలుసును దొంగించాలని చూశారు. వారిలో విజయ్ అనే వ్యక్తి గొలుసును దొంగిలించాడు. కానీ ఆమె గొలుసును గట్టిగా పట్టుకుని పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టూ ఉన్నవారు అక్కడికి వచ్చారు.
అయితే అప్పటికే ఇద్దరు దొంగలు పారిపోయారు. విజయ్ ఒక్కడే మిగిలాడు. ఈ క్రమంలో అతను భయపడి గొలుసును మింగేశాడు. అతన్ని అందరూ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే అతన్ని జనాలు చితకబాదారు. దీంతో పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఎక్స్రే గట్రా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది.
పోలీసులకు మొదట అతను గొలుసు మింగినట్లు తెలియదు. కానీ ఎక్స్రే లో తెలిశాక వారు తమదైన శైలిలో విచారణ చేశారు. అతను గొలుసు మింగినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుల సహాయంతో లాక్సేటివ్లు, అరటి పండ్లను విజయ్కు తినిపించి అనంతరం గొలుసును మలం ద్వారా బయటకు తీయించారు. దాన్ని యజమానురాలికి అప్పగించారు.