CM YS Jagan : అధికారంలో ఉండగానే సరిపోదు, ఓ వైపు ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడుతూనే మరోవైపు అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఇంకో వైపు పార్టీని బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికలకు నేతలను సిద్ధం చేయాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలి. అందుకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అవును.. సీఎం జగన్ కూడా సరిగ్గా ఇలాగే చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన సంచలన నిర్ణయాలను తీసుకోనున్నట్లు సమాచారం.
సీఎంగా ప్రమాణం చేసినప్పుడే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారు. దీంతో ఆ సమయం ఆసన్నమవుతుండడంతో.. జగన్ ఆ దిశగా చర్యలకు పూనుకుంటున్నట్లు సమాచారం. డిసెంబర్ వరకు కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పాత మంత్రుల్లో 90 శాతం మందిని తీసేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. కొత్త మంత్రులకు ఎంపీలను గెలిపించుకునే బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం.
ఇక పదవులను కోల్పోయిన వారికి పార్టీలో క్రియాశీలంగా పనిచేయాలని ఇప్పటికే జగన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో పాత మంత్రులు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీలతో దీనిపై చర్చించినట్లు సమాచారం. వారి సూచనల మేరకే కొత్త మంత్రులను జగన్ ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా జగన్ మంత్రి వర్గంలో మార్పులు చేయడం ద్వారా 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి వర్గంలో మార్పులపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో కొందరు నేతల మధ్య దూరం పెరగడంతో వారి మధ్య సఖ్యతను పెంచేందుకు కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో మార్పులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.