Chiranjeevi : నేడు నటుడు అల్లు రామలింగయ్య జయంతి కావడంతో మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రిలో సందడి చేశారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో హోమియో వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రితో తనకున్న అనుబంధం గురించి మెగాస్టార్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ అల్లు రామలింగయ్యకు, తనకు మధ్య కేవలం మామ, అల్లుళ్ళ అనుబంధం మాత్రమే కాదని, గురుశిష్యుల అనుబంధం కూడా ఉందని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలలో అల్లు రామలింగయ్య నటించి అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందారు.
తెరపై హాస్యాన్ని పండించే అల్లు రామలింగయ్య నిజ జీవితంలో మాత్రం ఎంతో సీరియస్ గా ఉన్నతమైన నిర్ణయాలను తీసుకునే వారని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య గురించి వెల్లడించారు. ఇక అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూపం, చెల్లుబోయిన వేణుగోపాల్ రావు, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.