Telangana : వారిద్దరూ నగరంలో పేరుమోసిన డాక్టర్లు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ డాక్టర్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు ఉంది. అయితే ఆమెను కూడా డాక్టర్ చేసి ఎంతో మందికి వైద్య సేవలు అందించాలని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పుట్టిన రోజే తన బిడ్డ కాటికి వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగి పోయారు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జయ మెటర్నిటీ నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ ఫణికుమార్, జయలలిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు నేహ. ఈమె గత ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీ ఎంట్రెన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతోంది. అయితే ఇదివరకు తన పుట్టిన రోజు వేడుకలను తన తల్లిదండ్రులతో కలిసి జరుపుకున్న నేహ మొట్టమొదటిసారిగా తన పుట్టిన రోజు వేడుకలను తన స్నేహితులతో కలిసి గోవాలో జరుపుకుంటానని అడగడంతో అందుకు తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.
ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన నేహ ఎంతో సంతోషంగా శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకలను జరుపుకుని తన ఆనందాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. అయితే ఆదివారం ఉదయం నేహకు ఉన్నఫలంగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. ఈ విషయం విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పుట్టిన రోజే మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు తీవ్రమైన దుఃఖ సాగరంలో మునిగిపోయారు.