ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే కులాలు వేరుగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకుంటే పెద్దలు పరువు హత్య అంటూ వారిని హత్య చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి పరువు హత్య తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంతో ఆ పెళ్లైన జంటకు దారుణంగా ముక్కు, చెవిలలో విషాన్ని నింపి చంపేశారు. ఈ
ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్త గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కుప్పందత్త గ్రామానికి చెందిన మురుగేశన్ అనే యువకుడు ఇంజనీరింగ్ చదివాడు. అతడు అదే ప్రాంతానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలపగా పెళ్లికి అంగీకరించలేదు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిని చంపేస్తామని బెదిరించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అందరు పెద్దలు మాదిరిగానే వీరు తమ పెళ్లి అంగీకరిస్తారని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వేరే చోట నివాసం ఉంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి, అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు వారికి మాయమాటలు చెప్పి వారికి ఘనంగా పెళ్లి చేస్తామని నమ్మించి వారి వెంట తీసుకు వచ్చారు. అయితే వారు ఊరికి కాకుండా శ్మ శానం వైపు తీసుకెళ్లడంతో వారిని చంపబోతున్నారని పసిగట్టిన ఆ జంట పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పక్కా ప్లాన్ తో వచ్చిన కుటుంబ పెద్దలు వారి వెంట తీసుకు వచ్చిన విషాన్ని ఆ జంట ముక్కులలో నుంచి శరీరంలోకి ఎక్కించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ మరణించారని తెలుసుకున్న తర్వాత శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తెలిసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 12 మందిని కస్టడీలోకి తీసుకుని ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.