నటుడు, సంఘ సేవకుడు సోనూసూద్కు ఐటీ విభాగం షాకిచ్చింది. సోనూసూద్కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం ఐటీ విభాగం అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ముంబైలో ఉన్న ఆయన ఇళ్లతోపాటు లక్నోలోని కంపెనీ కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేశారు.
కాగా నటుడు సోనూసూద్ను ఇటీవలే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. అక్కడి ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రోత్సహించేందుకు గాను సోనూ సూద్ను సీఎం కేజ్రీవాల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అయితే సోనూసూద్.. కేజ్రీవాల్తో సమావేశం అయిన అనంతరం పాలిటిక్స్ లో చేరుతున్నారా ? అని సోనూను మీడియా ప్రశ్నించింది. కానీ ఆయన ఆ వార్తలను కొట్టి పారేశారు. ఓ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే ఆ విధంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్తో చర్చించానని తెలిపారు.
అయితే ఆ మీటింగ్ అనంతరం సోనూసూద్కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్కమ్ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి సోనూ సూద్ పనిచేస్తారన్న వార్తల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులను చేయిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని ఖండించారు.
ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ప్రత్యేకమైనదని, ఒక వ్యక్తి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా ఐటీ చట్టం ప్రకారం పన్ను కట్టకపోతే ఇబ్బందులు తప్పవని, అందువల్ల దానికి, ఐటీకి ముడి పెట్టవద్దని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఏది ఏమైనా సోనూ సూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది.