ప్రస్తుతం ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా అనారోగ్యం వస్తే ముందుగా డాక్టర్ ను సంప్రదించకుండా భూత వైద్యులను సంప్రదించి తాయత్తులను కట్టిస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురపాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేవయ్య, సంగీత అనే దంపతులకు రెండు నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. అయితే ఎంతో ఆరోగ్యంగా ఉన్న బిడ్డ గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా ఏడుస్తూ ఉండడం వల్ల తల్లిదండ్రులు స్థానికంగా ఉండే దేవర బాల అనే భూతవైద్యుడి దగ్గరికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ భూతవైద్యుడు బాలుడు ఏడుపు మాన్పించడానికి బొడ్డు చుట్టూ పంటితో గట్టిగా కొరికాడు.
ఈ క్రమంలోనే బాలుడు మరింత గట్టిగా ఏడవడంతో వెంటనే తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే బాబు పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాబు మరణించాడు. అయితే బాబు ఏడవడంతో భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం వల్ల అతను ఆ బాలుడి బొడ్డు భాగంలో గట్టిగా కొరకడంతో లోపలి పేగు కట్ అయిందని, అందుకే బాబుకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి మరణించాడని వైద్యులు తెలిపారు. కేవలం మూఢనమ్మకాల వల్ల ప్రజలు ఇప్పటికీ ఈ విధమైన బాధలను అనుభవిస్తూనే ఉన్నారు.