కొందరు సాధారణ సమస్యలతో హాస్పిటల్లో చేరుతుంటారు. కానీ వారికి కొన్ని సందర్భాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు పరీక్షల్లో తేలుతుంది. దీంతో జరగరాని నష్టం జరుగుతుంది. ఓ మహిళకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్లో చేరింది. కానీ దురదృష్టవశాత్తూ రెండు కాళ్లనూ, ఒక చేయిని కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
హంగేరీలోని పెక్స్ అనే ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల మోనికా ఈ ఏడాది జనవరిలో కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరింది. అయితే జీర్ణాశయానికి రంధ్రాలు పడ్డాయని సర్జరీ చేస్తే చాలని వైద్యులు చెప్పారు. కానీ తరువాతే షాకింగ్ విషయం తెలిసింది. ఓ అరుదైన వ్యాధి కారణంగా ఆమె కాళ్లలో రక్త నాళాలు బ్లాక్ అయ్యాయని, అందుకనే ఆమెకు జీర్ణాశయంలో నొప్పి ఏర్పడిందని వైద్యులు గుర్తించారు.
అయితే కాళ్లలో ఉన్న రక్త నాళాల బ్లాక్లు పైకి వస్తే ప్రమాదమని, అందువల్ల కాళ్లను తీసేయాలని వైద్యులు చెప్పారు. దీంతో మోనికా షాక్ కు గురైంది. అయినా తప్పదు కనుక అంగీకరించింది. దీంతో ఆమెకు మార్చి 1వ తేదీన ఎడమ కాలును తీసేశారు. మార్చి 8న కుడికాలును తీసేయగా, ఎడమ చేయికి కూడా బ్లాక్స్ వచ్చాయని చెప్పి మార్చి 12న ఎడమ చేయిని తొలగించారు.
అయితే ఆయా భాగాలను తొలగించినా ఆమె సమస్య తగ్గలేదు. కేవలం 3 నెలల్లోనే ఆమెకు 16 సార్లు ఆపరేషన్లు చేశారు. అయినప్పటికీ ఆమెకు ఉన్న అనారోగ్య సమస్యను వైద్యులు తగ్గించలేకపోతున్నారు. వైద్య శాస్త్ర చరిత్రలోనే ఇది ఓ అత్యంత అరుదైన కేస్ అని, దీని వెనుక జన్యు సంబంధ కారణాలు ఉండి ఉంటాయని, ప్రస్తుతం ఈ సమస్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు మోనికా పడుతున్న బాధ మాత్రం వర్ణనాతీతంగా మారింది.