ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు అమ్మాయిల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ రోజు రోజుకూ అమ్మాయిలపై, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వారిపై జరిగిన దాడులను బయటకు చెప్పుకోలేక ఎంతోమంది ఆత్మహత్య శరణం అనుకొని ఆ దారిని ఎంచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన చాలా ఆలస్యంగా గుజరాత్ లో బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన ఓ యువతి చనిపోయిన పది రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అనారోగ్యంతో చనిపోయిందని గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఆమె సెల్ ఫోన్ అసలు విషయాన్ని బయట పెట్టింది. సదరు యువతిపై ముగ్గురు యువకులు లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలను చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందారు.
అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయిన ఆ యువతికి ఆ యువకుల నుంచి ఒక వాట్సాప్ వీడియో వచ్చింది. ఆ వీడియోలో తనని తాను నగ్నంగా చూసుకోవడంతో ఎంతో అవమానంగా భావించింది. ఈ క్రమంలోనే ఆ యువకులు ఆమెకి ఫోన్ చేసి డబ్బులు కావాలని, లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఎంతో కుంగిపోయిన ఆ యువతి ఈ విషయం బయట పడితే తన తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందని భావించి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు మాత్రం తన తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా చనిపోయిందని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పోలీసులకు ఈ విషయం చేరడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.