వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలు చెబుతుంటారు. అంటే పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు.. వారికి ఉన్న సమస్యలు, అనారోగ్యాల గురించి అబద్దం ఆడమని కాదు, ఇతర అంశాల్లో అబద్దాలు ఆడైనా పెళ్లి చేయాలని చెబుతారు. అయితే వారు మాత్రం ఆ యువకుడికి ఉన్న అనారోగ్య సమస్యల గురించి నిజాలను దాచి పెళ్లి చేశారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఆ యువకుడు ఏడాది తిరగకముందే చనిపోయాడు. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన ఊహా రెడ్డితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి సంబంధం కుదరడంతో ఊహ తన జీవితం గురించి ఎన్నో కలలు కనింది. అయితే ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. తన భర్తకు కిడ్నీ సమస్యలు ఉన్నాయనే విషయం తన అత్తమామలు దాచిపెట్టి పెళ్లి చేశారని తెలియడంతో బాధను దిగమింగుకుని అతనితో కాపురం చేసింది.
ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి కొద్దిరోజులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు చెయ్యి పడిపోయింది. ఈ బాధను భరించలేక విజయేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. తను మరణించేటప్పటికి ఊహ ఆరు నెలల గర్భిణీ. ఈ విధంగా ఒక అబద్ధం వల్ల తన జీవితం మొత్తం నాశనం అయిందని తనకు కూతురు పుట్టిన తర్వాత న్యాయం చేయాలంటూ అత్తవారింటిని ఆశ్రయించిన ఊహకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయింది. అత్తమామలు తనకు న్యాయం చేయకపోగా ఆమె కుటుంబంపై ఎదురుదాడి దిగి కర్రలతో కొట్టారు. దీంతో ఆమె పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.