కొందరికి అదృష్టం మరీ జలగల్లా పడుతుంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ జాలరి కొన్ని ప్రత్యేకమైన జాతికి చెందిన చేపలను పట్టాడు. వాటిని అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఉన్న ముర్బెకు చెందిన చంద్రకాంత్ తారే ఆగస్టు 15న ఇంకొందరు జాలర్లతో కలిసి వాధ్వన్ జిల్లాలోని తీర ప్రాంతం నుంచి 25 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే ఆగస్టు 28న అతను ఘోల్ (Ghol) అనే జాతికి చెందిన ప్రత్యేకమైన చేపలను పట్టాడు. మొత్తం 157 ఘోల్ చేపలను పట్టాడు. తరువాత వాటికి ముర్బెలో వేలం నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందిన కొందరు వర్తకులు మొత్తం 157 చేపలను రూ.1.33 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఆ జాలరి పంట పండింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
కాగా ఘోల్ చేపలను Sea Gold చేపలు అని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత ఖరీదైన చేపల జాతిలో ఒకటి. ఇవి మన దేశంలోని సముద్రాల్లో చాలా తక్కువగా లభిస్తాయి. కాలుష్యం కారణంగా ఈ చేపలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. ఈ చేపలను పట్టేందుకు మత్స్యకారులు కొన్ని సార్లు సముద్రంలో చాలా లోతు వరకు గాలం వేయాల్సి ఉంటుంది.
ఇండోనేషియా, థాయ్లాండ్, హాంగ్ కాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఘోల్ చేపలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఈ చేపలు ఎక్కువ ధర పలుకుతాయి. వీటి నుంచి తీసే పలు పదార్థాలతో మందులను తయారు చేస్తారు. ఈ చేపల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఇవి అత్యంత ఆరోగ్యకరమైన చేపలుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ జాలరికి ఈ చేపలు లభించడం వల్ల అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.