శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మనకు సకల సంపదలను ప్రసాదిస్తారని భావిస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం కోసం మహిళలు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. మరి ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి? ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 20వ తేదీన వచ్చింది. ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. వివిధ రకాల పిండి వంటలను అమ్మవారికి సమర్పించి, ఉపవాస దీక్షలతో ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వ సంపదలు కలుగుతాయని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఇలాంటి వ్రతాన్ని చేయాలంటే తప్పనిసరిగా సరైన ముహూర్తంలో చేయటం వల్ల మనకు మంచి కలుగుతుందని భావిస్తారు.
వరలక్ష్మీ వ్రతం చేయడానికి సింహలగ్నంలో చేసేవారు ఉదయం 6.08 నుంచి 8.01 వరకు ఎంతో మంచి సమయం. అదేవిధంగా వృషభ లగ్నంలో 12.09 నుంచి 2.20 వరకు ఎంతో అనువైన సమయం. కుంభలగ్నంలో పూజ ముహూర్తం సాయంత్రం 6.21 నుంచి 8.03 వరుకు సరైన సమయం. వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు కూడా రాహుకాలంలో చేయకూడదు. ఈ సమయాలలో వరలక్ష్మీ వ్రతం ఆచరించి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వడం ద్వారా అమ్మవారి కృప మనపై ఉంటుంది.