తన జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఆ యువతి తన భర్తతో కలిసి అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో కలలు కన్నది. అయితే ఆ కలలన్నీ మృత్యువు రూపంలో కల్లలయ్యాయి. తనకు కాబోయే భర్తతో కలిసి సరదాగా బయటకు వెళ్ళిన ఆ యువతిని మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబలించిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్ కి చెందిన ద్రిష్టి అనే యువతికి ఏడాదిన్నర క్రితం రాజ్ వాఘేలా అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే సదరు యువతి తన కాబోయే భర్తతో కలిసి ఆదివారం సరదాగా బయటకు వెళ్లింది. ఇలా బయటకు వెళ్లిన ఈ జంట రాత్రి 9.30 గంటల సమయంలో రాయ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలోని సిగ్నల్స్ వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యారు.
వాహనంపై వెళ్తున్న ఈ జంటను వెనుకనుంచి ట్రక్ ఢీకొంది. దీంతో ఆ యువతి వాహనంపై నుంచి కింద పడింది. తరువాత ఆమెపై నుంచి ట్రక్ టైర్ ఎక్కింది. దీంతో ద్రిష్టి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో రాజ్ వాఘేలా కూడా గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన జరగగానే ట్రక్ డ్రైవర్ అక్కడినుంచి పారిపోగా ఈ ప్రమాదం చూసిన స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు యువతిని ఆస్పత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స తీసుకుంటూ మరణించింది. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ద్రిష్టి మరణించడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.