రహదారులపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు దురదృష్టవశాత్తూ ప్రమాదాల బారిన పడుతుంటాం. మన ప్రమేయం లేకుండానే జరిగే ప్రమాదాల్లో మనం చిక్కుకుంటుంటాం. ఆ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాగే జరిగిందని చెప్పవచ్చు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కేరళలోని త్రిసూర్కు చెందిన 34 ఏళ్ల ప్రమోష్ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంపై తన భార్యను త్రిసూర్ రైల్వే స్టేషన్లో దింపేందుకు వెళ్తున్నాడు. వాహనాన్ని అతను నడిపిస్తుండగా వెనుక అతని భార్య కూర్చుంది. మార్గమధ్యలో అయ్యంతోల్ అనే ప్రాంతం వద్దకు రాగానే ఒక్కసారిగా ఓ నెమలి రహదారిపై ఎగురుతూ వచ్చి అతన్ని డీకొట్టింది. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పింది.
నెమలి ఢీకొట్టే సరికి అదుపు తప్పిన వాహనం రోడ్డుపై స్కిడ్ అయింది. దీంతో ప్రమోష్, అతని భార్య రోడ్డుపై పడిపోయాడు. తీవ్రగాయాలకు గురైన ఆ ఇద్దరినీ హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని భార్య చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో నెమలి కూడా చనిపోగా దాని మృతదేహాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో ఉన్న పొలాల్లోంచి ఆ నెమలి రోడ్డు మీదకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.