వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరి మనసు ఒకరికి ఇచ్చుకున్నారు. కానీ విధి వింత నాటకం ఆడింది. యువతికి తల్లిదండ్రులు ఇంకో వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆ జంట ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే..
ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగకపోవడంతో ఆ యువతి మనస్థాపం చెందింది. తాను ప్రేమించిన వ్యక్తి ఇక తనకు దక్కడేమోనని భావించింది. ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో చోటుచేసుకుంది.
కొండుబొట్లవారిపాలేనికి చెందిన ప్రవల్లిక, శ్రీకాంత్లు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం గత నెల రోజుల కిందట ఆమెకు ఇంకో యువకుడిని ఇచ్చి వివాహం జరిపించారు.
ఆషాఢమాసం కావడంతో ప్రవల్లిక గత కొద్ది రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. అయితే శ్రావణమాసం రావడంతో ఇంకో రెండు రోజుల్లో ఆమె అత్త వారింటికి వెళ్లాల్సి ఉంది. కానీ సోమవారం సూర్యలంక గ్రామంలో తాను ప్రేమించిన వ్యక్తితో కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఆ యువకుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దర్నీ అక్కడి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం పొన్నూరుకు తరలించారు. ఈ క్రమంలో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.