కొన్ని రకాల ప్రత్యేకమైన పాములను ఇంట్లో ఉంచుకున్నా, వాటికి పూజలు చేసినా అదృష్టం, ధనం కలసి వస్తాయని ఇప్పటికీ కొందరు నమ్మేవారు ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అరుదైన జాతికి చెందిన పాములను స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని దుధ్వా అటవీ ప్రాంతంలో ఎరుపు రంగులో ఉండే కొండ చిలువను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆ పామును స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ వ్యక్తులను పోలీసులు శాలు కశ్యప్, ముకేష్ కశ్యప్, సందీప్ సింఘాలలుగా గుర్తించారు. వీరికి అఫ్సర్ అనే డ్రైవర్ సహకారం అందించాడు. వారు ఆ పామును ఓ కారులో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు.
వారందరూ ఢిల్లీకి చెందిన వారు కాగా దుధ్వా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఖెరి అనే గ్రామంలో వారు ఆ పామును స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలకు కొన్నారు. దాన్ని ముంబైలో రూ.50 లక్షలకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు.
కాగా ఎరుపు రంగులో ఉండే ఆ కొండ చిలువ తోక కూడా తలలాగే ఉంటుంది. దీంతో దాన్ని మొదటి సారి చూస్తే దానికి రెండు తలలు ఉన్నాయేమోనని ఎవరైనా సరే అనుకుంటారు. ఇక ఈ పాములకు చైనాతోపాటు పలు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులు అవుతారని కొందరు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు.