ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు పరాకాష్ట ఈ సంఘటన. స్కూల్ ఫీజు కట్టలేదని ఆ బాలికను ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్లో అందరి ముందు అవమానించాడు. ఆ అవమాన భారం భరించలేని బాలిక ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. దీంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్పై ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న ఉన్నావ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదర్శ్ నగర్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి 15 ఏళ్ల కుమార్తె స్థానికంగా ఉన్న ఏబీ నగర్లోని సరస్వతి విద్యా మందిర్లో 10వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించలేదు. దీంతో ఆ బాలికపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది.
ఇక తాజాగా ఆ బాలికను పిలిపించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెను అందరి ముందు అవమానించాడు. ఫీజు కట్టలేదని ఎగతాళి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఆమె ఆ అవమాన భారాన్ని భరించలేకపోయింది. ఆమె ఇంటికి వస్తూనే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలో వారు ఆ ప్రిన్సిపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రిన్సిపాల్ కథనం మాత్రం మరోలా ఉంది. తాము ఎల్లప్పుడూ ఫీజు విషయాలను తల్లిదండ్రులతోనే చర్చిస్తామని, విద్యార్థులపై ఒత్తిడి తేమని, ఆ బాలిక తల్లిదండ్రులు రూ.2000 ఫీజును చెల్లించారని, అలాంటిది మళ్లీ ఎలా అడుగుతామని అన్నాడు. ఆ బాలికకు ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకనే ఆమె చనిపోయి ఉంటుందని.. తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం కేసును విచారిస్తున్నారు.