మన దేశంలో ఎక్కడో ఒక చోట ఒక్కో నిమిషానికి ఎంతో మంది లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చాలా వరకు మహిళలు ఒంటరిగా ఉంటే వారిని ఆకతాయిలు ఏడిపించడమో, లైంగిక వేధింపులకు గురి చేయడమో, అత్యాచారాలు చేయడమో చేస్తుంటారు. అయితే ఆ యువతి పట్ల కూడా ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ అతన్ని ఆమె చాలా తెలివిగా పట్టుకుంది. తరువాత అతనితో సారీ చెప్పించుకుని మరీ అతన్ని పోలీసులకు అప్పగించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అస్సాంలోని గువాహతిలో భావన కశ్యప్ అనే యువతి నివాసం ఉంటోంది. అయితే రహదారిపై ఉన్న ఆమె వద్దకు మధుసన రాజ్కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. సినాకిపత్ అనే ప్రాంతానికి ఎలా వెళ్లాలని ఆమెను దారి అడిగాడు. ఆమె తనకు తెలియదని చెప్పింది. అయితే అతను అదను చూసుకుని ఆమె వక్షోజాలను పట్టుకున్నాడు. దీంతో వెంటనే ఆమె షాక్కు గురైనా అతని స్కూటర్ను పట్టుకుంది. అతను అదే పనిగా యాక్సలరేటర్ రైజ్ చేశాడు. కానీ ఆమె దాన్ని పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి తోసింది. దీంతో అతని స్కూటర్ కాలువలో ఇరుక్కుపోయింది. ఇక చేసేది లేక అతను అక్కడే ఆగిపోయాడు.
ఇక వెంటనే ఆమె అతన్ని దొరికించుకుని చెడా మడా తిట్టింది. చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. కానీ అది క్షమించరాని తప్పు. అందుకని ఆమె పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. కాగా ఆమె ఈ సంఘటన మొత్తాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. అందులో ఉన్న వీడియోను కూడా గమనించవచ్చు. ఆమె చేసిన పనికి ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు.