కొన్నిసార్లు మనం చేసే సరదాలు ప్రమాదాలకు కారణం అవుతాయి. సరదాగా ఆనందంగా గడుపుతున్న క్షణాలలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుని ఎన్నో కష్టాలను తెచ్చి పెడుతుంటాయి, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలను ఎన్నో చూసి ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. సరదాగా అత్తవారింటికి వెళ్ళిన యువకుడు అటు నుంచి అనంత లోకాలకు వెళ్ళిన ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్సింగ్నగర్కు చెందిన అఖిల్సాయి (21)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. శ్రావణ మాసంలో వీరి వివాహాన్ని నిశ్చయించారు. ఈ క్రమంలోనే అఖిల్ తన కాబోయే అత్తవారి ఇంటికి వెళ్లాడు.
ఈ విధంగా అత్తవారింటికి వెళ్ళిన అఖిల్ తనకు కాబోయే భార్యతో పాటు మరో ఇద్దరితో కలిసి దగ్గరలో ఉన్నటువంటి లొక్కిగుండంలోకి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు.అందరూ ఎంతో సరదాగా గడుపుతున్న క్రమంలో అఖిల్ సుడిగుండంలో చిక్కుక పోయాడు. అఖిల్ ఎంతసేపటికీ కనిపించకపోవడంతో వధువు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే గ్రామస్తులు అక్కడికి వచ్చి అతనిని వెతికే సరికి రాత్రి తొమ్మిది గంటలయింది. అప్పటికే అఖిల్ మృతి చెంది ఉండడంతో వధువు కుటుంబ సభ్యులు, తనకు కాబోయే భార్య కన్నీరుమున్నీరైంది.ఈ క్రమంలోనే అఖిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.