Krishnam Raju : కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత స్టార్ హీరోగా ఎదిగారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని తెలిపారు. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా చెప్పారు. కృష్ణంరాజుకు పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో సెప్టెంబర్ 5న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నెన్యూమోనియా ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. కృష్ణంరాజుకి వెంటిలేర్పై చికిత్స అందించాం. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారి తెల్లవారుజామున 3.16 గంటలకి ఆయన మృతి చెందారు అని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. సినీ రంగంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.