సోషియో ఫాంటసీ, టైం ట్రావెల్ కొత్త కథాంశంతో ఆగస్టు 5న బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను అందుకున్నాడు కళ్యాణ్ రామ్. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో అలరిస్తోంది. కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయగా ఆయన సరసన హీరోయిన్లుగా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందజేశారు. దర్శకుడు వశిష్ట కూడా పవర్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడని చెప్పవచ్చు. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతోంది.
తాజాగా ఈ చిత్రం పార్ట్ 2 రూపంలోనూ రాబోతోంది అంటూ ఆసక్తికరమైన విశేషాలు వెల్లడయ్యాయి. బింబిసార కథాంశాన్ని నాలుగు భాగాలుగా విభజించినట్లు కళ్యాణ్ రామ్ ఒకసారి మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ లో బింబిసారుడు మనిషిగా మారే దశ మాత్రమే చూపించారు. ఇక తర్వాత పార్ట్-2 ఉంది అంటూ సంజీవని పుష్పం చూస్తూ ప్రేక్షకులకు ఒక హింట్ ఇచ్చారు.
మొదటి భాగంలో కథ పరంగా బింబిసారుడు తమ్ముడు దేవదత్తను చంపిన సన్నివేశం నుంచి.. చివరకు ప్రాణాపాయ స్థితికి చేరుకునే సమయం వరకు ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు కథను తెరకెక్కించాడు. అంటే మొదటి భాగంలో కేవలం బింబిసారుడు మనిషిగా మారే దశను మాత్రమే మనకు దర్శకుడు పరిచయం చేశాడు. పార్టు 2లో సంజీవని ద్వారా ప్రాణాలు పోసుకొని బింబిసారుడు తమ్ముడు దేవదత్తతో కలిసి రాజ్యపాలనను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడని ప్రేక్షకులలో కొత్త ఊహలు తలెత్తుతున్నాయి.
కానీ ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా రెండో పార్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా డైరెక్టర్ వశిష్ట, హీరో కళ్యాణ్ రామ్ లు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్వరలో బింబిసార చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల క్లబ్ లో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు.