Cat : పెంపుడు జంతువులు అంటే.. అంతే.. మనం వాటిని ప్రేమగా పెంచుకుంటే అవి మనపై ఎంతో ప్రేమను చూపిస్తాయి. మనతో ఆప్యాయంగా మెలుగుతాయి. అందుకనే మానవులు ఎంతో పురాతన కాలం నుంచి కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. అయితే కొన్ని పెంపుడు జంతువులు మాత్రం తమ యజమానులను ఎల్లప్పుడూ అంటి పెట్టుకునే ఉంటాయి. దీంతో వారు ఒక వేళ చనిపోతే అవి ఆ బాధ నుంచి బయట పడవు. సెర్బియాలోనూ అచ్చం ఇలాగే జరిగింది.
సెర్బియాలో గతేడాది నవంబర్ 6వ తేదీన షేక్ మౌమర్ జుకోర్లి అనే వ్యక్తి చనిపోయాడు. అతను ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే అతను చనిపోయినప్పటి నుంచి అతని పెంపుడు పిల్లి రోజూ అతని సమాధి వద్దకు వెళ్లి కాసేపు కూర్చుని వస్తోంది. దీంతో ఆ దృశ్యాన్ని చూసి అందరూ చలించిపోతున్నారు.
ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ పిల్లి ఫొటో కాస్తా వైరల్గా మారింది. అలా ఆ పిల్లి గత 2 నెలల నుంచి ఇలాగే చేస్తోంది. తన యజమాని సమాధి వద్ద రోజూ కాసేపు గడిపి వస్తోంది. ఎప్పటికైనా అతను వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నట్లు ఆ పిల్లి మనకు కనిపిస్తోంది. అయితే ఈ ఫొటో వైరల్ కాగా ఇప్పటికే దీనికి 60వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అందరూ ఆ పిల్లికి యజమాని పట్ల ఉన్న అభిమానం, ప్రేమను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.