Viral News : రహదారిపై వెళ్తున్నప్పుడు కొందరికి చిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వర్షం పడినప్పుడు రోడ్డు మీద లేదా పక్కన బురద గుంతలు ఉంటే.. వాటిల్లోంచి వాహనాలు వెళ్లినప్పుడు వాటి పక్కనే ఉండరాదు. ఉంటే మీద బురద పడుతుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందినే ఆ మహిళా పోలీసు ఎదుర్కొంది. కానీ ఆమె అందుకు ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రేవా అనే ప్రాంతంలో ఉన్న సిర్మౌర్ చౌక్లో ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ పక్కనే ఉన్న మహిళా పోలీసుపై బురద చిందించాడు. ఆమె పేరు శశికళ కాగా.. ఆమె స్థానిక కలెక్టర్ ఆఫీస్లో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తోంది.
అయితే బురద చిందించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వెంటనే అతన్ని ఆపి ముందుగా మీద పడిన బురదను శుభ్రం చేయించుకుంది. తరువాత అక్కడి నుంచి వెళ్తూ అతన్ని ఆమె చెంప దెబ్బ కొట్టింది. ఈ దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి షేర్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్గా మారింది.
సదరు మహిళా పోలీసు ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు. బురద పడితే క్లీన్ చేయించుకోవడం వరకు బాగానే ఉంది, కానీ అతన్ని చెంప దెబ్బ కొట్టడం ఎందుకని అంటున్నారు.