కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ లాక్డౌన్ను అమలు చేస్తుండగా లాక్ డౌన్ను అమలు చేయని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై రోజు రోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హైకోర్టు విచారిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్పై రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా, వద్దా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను చర్చించాక కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే తెలంగాణలో టెస్టులు తక్కువ చేస్తున్నారు కనుక తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయనే అపవాదు ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే లాక్ డౌన్పై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. కానీ మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం కేసీఆర్ లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.