Pradhuman Singh Tomar Cleaned Toilets in Government School : ప్రజలు వేసిన ఓట్లతో ప్రజా ప్రతినిధులుగా గెలిచే నేతలు తిరిగి ప్రజల ముఖం చూడరు. వారి సమస్యలను పట్టించుకోరు. చాలా మంది ప్రజా ప్రతినిధుల వ్యవహారం ఇలాగే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిజమైన నాయకులమని నిరూపిస్తున్నారు. తాము ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం వెనుకాడడం లేదు. ఆ మధ్యప్రదేశ్ మంత్రి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ తాజాగా అక్కడి గ్వాలియర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ కొందరు బాలికలు పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తోమర్ స్వయంగా రంగంలోకి దిగి ఆ పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు.
అయితే ఆయన ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆయన ఇలాగే టాయిలెట్లను శుభ్రపరిచారు. ఈ క్రమంలోనే తోమర్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలని అభినందిస్తున్నారు.