Roja: ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజాకి విమాన ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుండి తిరుపతికి వెళాల్సిన ఇండిగో సంస్థకి చెందిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇండిగో సంస్థ విమానాన్ని అత్యవసరంగా బెంగళూరులో ల్యాండ్ చేశారు. అయితే అత్యవసర లాండింగ్ కి సంబంధించిన అసలైన వివరాలు పాసెంజర్స్ కి చెప్పలేదని, మేఘాల వల్ల సమస్య అని అబద్ధం చెప్పారని అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రోజా ఒక వీడియో విడుదల చేశారు.
సాంకేతిక సమస్య వచ్చింది అని చెప్పకుండా నాలుగు గంటల పాటు విమానంలోనే ఉంచారని, కనీసం డోర్స్ కూడా ఓపెన్ చేయలేదని రోజా వీడియోలో వివరించారు. అసలేం జరుగుతుందో చెప్పకుండా తమ ప్రాణాలతో చెలగాటం ఆడారని ఇండిగో సంస్థ యాజమాన్యంపై, సిబ్బందిపై ఆమె ఆరోపణలు చేశారు. ఆపరేషన్ అయింది, అంతసేపు కూర్చోలేము అని అడిగితే ఒక్కో పాసెంజర్ ఐదు వేల రూపాయలు కట్టాలని చెప్పారని రోజా అన్నారు.
దీనిపై ఇండిగో సంస్థ కచ్చితంగా సమాధానం చెప్పాలని, ఇండిగో సంస్థ అధికారులపై డిఫర్మేషన్ కేసు కచ్చితంగా వేస్తానని రోజా అన్నారు. ఇదే విమానంలో మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు కూడా వున్నారు. ఈ ఘటనపై యనమల తీవ్రం గా మండిపడ్డారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం సరైంది కాదని, అధికారులు, సిబ్బంది తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటన పై ఇండిగో సంస్థ స్పందించాలని ప్రయాణికులు కోరారు. తిరుపతి ఎయిర్పోర్టు అధికారులు సైతం ఇండిగో సంస్థ వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని మీడియాకి తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.