ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెందిన బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తించకుండా క్షణికావేశంలో నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఇంట్లోని వారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని గోల్నాక అనే ప్రాంతంలో ఉన్న తిరుమలనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఇంట్లోనే టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య విజయలక్ష్మి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే టైలరింగ్ పని చేయడమే కాకుండా శ్రీనివాసులు కాలనీల్లో తిరుగుతూ చీరలను విక్రయిస్తుంటాడు.
ఈ క్రమంలోనే అతను ఇటీవల తన భార్యకు ప్రేమతో ఓ జాకెట్ కుట్టాడు. కానీ అది నచ్చలేదని విజయలక్ష్మి చెప్పింది. ఈ క్రమంలో దంపతులు ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీనికి మనస్థాపం చెందిన విజయలక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలా ఆమె క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన పిల్లలకు తల్లి లేకుండా చేసింది.