Nikita Dutta : సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా రక్షణ లేకుండా పోయింది. నటీమణులపై ఇటీవల వరుస దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నటి షాలు చౌరాసియాపై ఓ దుండగుడు దాడి చేసి ఆమె యాపిల్ ఐఫోన్ లాక్కుని పారిపోయాడు. ఈ దాడిలో చౌరాసియా గాయాలపాలు కావడంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
ముంబైలో నటి నిఖిత దత్తాకు ఇదే తరహా సంఘటన ఎదురైంది. ఆదివారం ఆమె ముంబై బాంద్రా సమీపంలో రోడ్డుపై నడిచివెళుతుండగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బాంద్రా రోడ్ నంబర్ 14లో రాత్రి 7:45 గంటల సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడిచివెళుతున్న తనపై దాడి చేసి మొబైల్ ను చేతిలో నుండి లాక్కొని వెళ్లిపోయారు అని చెప్పింది. రెండు మూడు సెకండ్స్ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. వెంటనే కోలుకొని బైక్ ని వెంబడించాను అని పేర్కొంది.
నా అరుపులకు అక్కడ ఉన్నవారు స్పందించారు. ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లిద్దరూ వేగంగా బైక్ నడుపుకుంటూ దొరక్కుండా పారిపోయారు. స్థానికులు నాకు మద్దతుగా నిలిచారు. వాటర్ ఇచ్చి నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను.. అని ఆమె వివరించారు. అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. ఇలాంటి విషయాలపై జాగ్రత్త, ధైర్యంగా ఉండు.. అంటూ కామెంట్ చేశారు. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.