NTR : నందమూరి వంశ వారసుడు ఎన్టీఆర్ రీసెంట్ గా తన మేనత్తకు జరిగిన అవమానంపై స్పందించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా చంద్రబాబునాయుడు గురించి గానీ, భువనేశ్వరీ దేవిల గురించి గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలనే నేపథ్యంలో మోరల్ సైన్స్ క్లాస్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా అవమానాలు ఎదుర్కుంటున్న కుటుంబం తరఫున తాను మాట్లాడలేదని అన్నారు.
ఈ వీడియోపై టీడీపీ అభిమానులు, టీడీపీ సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రిలీజ్ చేసిన వీడియోపై వారంతా మండిపడుతున్నారు. ఈ వీడియో విడుదల చేయకుండా కనీసం మౌనంగా ఉన్నా బావుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోతో తమను మరింత అవమానపరిచారని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని నిలబెడతారని ఆశించిన టీడీపీ అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది.
మరోవైపు అధికార పార్టీ గురించి చర్చిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ అరాచక పాలన అనే పదాన్ని ఉపయెగించడంతో వైసీపీ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలో షర్మిల, విజయమ్మ, భారతిలపై టీడీపీ అభ్యర్థులు మాటలతో అవమానించినప్పుడు ఎందుకు ఇలా నోరు విప్పలేదని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు భారతి ఏం చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అడిగినప్పుడు నోరు విప్పలేదని, వైఎస్సార్ చనిపోయినప్పుడు విజయమ్మపై చేసిన ఆరోపణలపైనా స్పందించకుండా ఇప్పుడెందుకు నోరు విప్పడం అని ప్రశ్నిస్తున్నారు.