Karthikeya : ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. తాన్యా రవిచంద్రన్ , సాయికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే తన ప్రియురాలు లోహితకు లవ్ ప్రపోజల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు కార్తికేయ. నవంబర్ 21 (ఆదివారం) ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్ల వేయనున్నట్టు చెప్పుకొచ్చారు.
ఆగస్టులో గ్రాండ్గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ ఇప్పుడు పెళ్లి కొడుకయ్యాడు. అతడిని పెళ్లి కొడుకుని చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ-లోహిత 2010లో మొదటిసారిగా కలుసుకున్నారు. వరంగల్ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ కోర్సు చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
2018లో ‘ఆర్ ఎక్స్ 100’ తో పరిచయమైన కార్తికేయ ఎప్పుడూ తన ప్రేమ విషయం గురించి బయటకు వెల్లడించలేదు. ఉంగరాలు మార్చుకుని ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ జంటని చూసి చూడముచ్చటగా ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ సక్సెస్ను ఆస్వాదించే పనిలో ఉన్నాడీ హీరో. అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’ సినిమాతో త్వరలో తమిళ తెరపై కూడా మెరవనున్నాడు కార్తికేయ. హీరోగా, విలన్గా రాణిస్తూ అభిమానులకి వినోదం పంచుతున్నాడు.