Simbu : కోలీవుడ్ హీరో శింబు తమిళ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. మూవీ విశేషాలను పంచుకుంటూనే ఒక్కసారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు.
శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చారు. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్లను ప్రస్తావించకుండానే శింబు అన్నారు. “నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ శింబు తన అభిమానులను కోరాడు.
వెంకట్ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నాడు. ‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదువ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు. కాగా, గత దశాబ్ద కాలంగా శింబు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కొంటున్నాడు.