Kota Srinivasa Rao : తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ స్టైలే వేరు. ఆయన సినిమాలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. హీరోల విషయంలోనే కాకుండా సినిమాలోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. హార్ట్ టచింగ్ డైలాగ్స్ తో హీరోహీరోయిన్లను ఎంతో చక్కగా ప్రదర్శిస్తారు.
త్రివిక్రమ్ శ్రీనివాసరావుపై ప్రముఖ టాలీవుడ్ నటుడు కోటశ్రీనివాసరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా కోటశ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ టాలెంట్ ని ఎంతగానో మెచ్చుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో త్రివిక్రమ్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పారు.
ఆత్రేయ, జంధ్యాల బాటలో డైలాగ్స్ తో సినిమానే నడిపించగల సమర్ధుడు త్రివిక్రమ్ అని అన్నారు. ఏమీ అన్నట్లే ఉండదని, భాషను పలికినట్లే అనిపించదు గానీ గొప్ప భావాన్ని పలికించే మాటల్ని రాసి సినిమాని తెరకెక్కించడం ఆయన స్పెషాలిటీ అన్నారు. త్రివిక్రమ్ చదువుకున్న సంస్కారవంతుడని, ప్రతి మాటకు, ప్రతి రాతకు ఓ అర్థం పరమార్థం ఉండాలనుకునే వ్యక్తి అన్నారు.
కాగా అత్తారింటికి దారేది సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని విషయాలను కోట షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కోట శ్రీనివాసరావుది చాలా చిన్న పాత్ర అయినా కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న రోల్ కావడంతో ఒప్పుకున్నారట.
ఈ సినిమా కోసం ఆయన గెటప్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అలాగే డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదట. కానీ షాట్ రెడీ అనగానే చేసేశానని అన్నారు. త్రివిక్రమ్ వెంటనే ఆయన దగ్గరకు వచ్చి మీరున్నారనే ధైర్యంతోనే అలాంటి డైలాగ్స్ రాశానని అన్నారట. ఆ రోజును తన జీవితంలోనే మర్చిపోలేనని కోట అన్నారు.
ఈ సినిమాను చూసిన చాలామంది సన్నిహితులు కోట శ్రీనివాసరావుకు ఫోన్ చేసి సీమ యాసను ఎంత బాగా మాట్లాడారని మెచ్చుకున్నారట. ఈ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ కే సొంతం అని అన్నారు. అలాగే ఆయనకు ఈ పాత్ర ఇచ్చినందుకు ఎప్పటికీ త్రివిక్రమ్ కు రుణపడి ఉంటానని.. కోట శ్రీనివాసరావు అన్నారు.