అతను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎప్పుడు ఎలా ఉండాలో, పరిస్థితులను ఎలా అధిగమించాలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి. ఇలా పిల్లలకి ఎన్నో మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు క్షణికావేశంలో కొన్ని సమస్యల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త మరణించాడని తెలుసుకున్న భార్య రెండంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నర్సాపూర్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న రామారావు అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అమ్ములు రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమెకు కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే తమ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక ఈ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చూపులు స్థానికులను కలచివేశాయి. కాగా తమ ఉపాధ్యాయుడు మరణించాడు అన్న విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.