Adipurush : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్.. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా చేస్తోంది. ఇక రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
అత్యంత భారీ బడ్జెట్తో 3డిలో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి 3 నెలలకు పైగానే అవుతోంది. మరోవైపు పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేందుకే కొన్ని ఏళ్లు పడుతుందని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ ఈ చిత్ర షూటింగ్ కేవలం 103 రోజుల్లోనే పూర్తయింది. అవును.. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ స్వయంగా తెలియజేశారు.
ఆది పురుష్ మూవీ షూటింగ్ 103 రోజుల్లో పూర్తయ్యింది. ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. అని అన్నారు. కాగా ఈ మూవీని భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ మూవీతోనూ అలరించనున్నాడు.