T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 27వ మ్యాచ్లో నమీబియాపై ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది. ఆప్గనిస్థాన్ ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా తడబడింది. పసికూన జట్టు కావడంతో గెలుపొందలేకపోయింది. ఈ క్రమంలో నమీబియాపై ఆఫ్గనిస్థాన్ 62 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్మెన్లలో మహమ్మద్ షాజాద్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా.. హజ్రతుల్లా జజై 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మన్ మహమ్మద్ నబీ 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 32 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆస్గర్ ఆఫ్గన్ (31 పరుగులు) కూడా రాణించాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్లు చెరో 2 వికెట్లు తీశారు. జేజే స్మిట్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టు బ్యాట్స్మెన్లలో డేవిడ్ వియసె 30 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ఆఫ్గన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ లు చెరో 3 వికెట్లు తీయగా, గుల్బదీన్ నయీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.