Kaikala Satyanarayana : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంట్లో జారి పడ్డారు. నొప్పులు ఎక్కువగా ఉండడంతో సికిందరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించి ఇంటికే పరిమితయ్యారు.
కైకాల సత్యనారాయణ చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ చిత్రాల్లో తెరమీద కనిపించారు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినిమాల్లో అడుగు పెట్టారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల సుమారుగా 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో, తండ్రి, తాత ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.
రాజకీయాలలోనూ తనదైన ముద్రవేసుకున్నారు కైకాల. 1998లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2011లో సత్యనారాయణకు ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు లభించింది. కొద్ది రోజుల క్రితం కైకాల బర్త్ డే సందర్భంగా చిరంజీవి దంపతులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కొద్ది సేపు కైకాలతో విలువైన సమయం గడిపారు.