Puneeth Rajkumar : కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణంతో కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడిగానే కాదు మంచి మానవతావాదిగా ఎందరో మనసులు గెలుచుకున్నాడు పునీత్. ఆయనపై అభిమానులకు ఎనలేని ప్రేమ ఉంది, ఈ క్రమంలో పునీత్ మరణించిన విషయం తెలుసుకుని అభిమానులు మృత్యువాత పడుతున్నారు.
పునీత్ మరణం తర్వాత కొందరు గుండెపోటుతో మరణించగా, మరి కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కర్ణాటకలో నలుగురు అభిమానులు ఇలా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణవార్త విన్న వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే రాయచూరు జిల్లాలో ఇద్దరు అభిమానులు బసవ గౌడ్, మహమ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అందులో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
చామరాజనగర్ జిల్లాలో మునియప్ప అనే అభిమాని టీవీ చూస్తూనే పునీత్ రాజ్కుమార్ చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఉడిపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన హీరో పునీత్ చిత్రపటానికి పూలమాల వేస్తూ అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. పునీత్ మరణ వార్త తర్వాత కర్ణాటక ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. థియేటర్స్ను మూసి వేసింది. మద్యం విక్రయాలపై ఆదివారం వరకు ప్రభుత్వం నిషేధం విధించింది.