NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఎన్టీఆర్ వారసుడిగా తన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారక్ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంలో నటించారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడంతో తారక్ తన తర్వాత సినిమాలన్నింటినీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులను కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నారు.
తారక్ కేవలం యాక్షన్ చిత్రాలలో మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాలలోనూ ఎంతో అద్భుతంగా నటించగలరనీ యమదొంగ సినిమా ద్వారా నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అంటే కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ను కథానాయకుడిగా ఎంపిక చేసుకొని తనతో ఒక పౌరాణిక చిత్రం చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.