Charmme Kaur : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న చార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా చెలామణీలో ఉన్న ఛార్మి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే హీరోయిన్ గా సినిమాల్లో నటించకపోయినా నిర్మాతగా బాధ్యతలను చేపట్టి పలు చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛార్మి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా “రొమాంటిక్” చిత్రాన్ని నిర్మించారు.
అక్టోబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఛార్మి మాట్లాడుతూ.. తన గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు కేవలం తన శరీర ఫిట్ నెస్ పై మాత్రమే దృష్టి పెట్టేదాన్నని, అప్పుడు ఎంతో ప్రశాంతంగా తన జీవితం ఉండేదని తెలిపారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నిర్మాతగా ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవలసి ఉంటుందని, నిర్మాతగా మారిన తర్వాత తాను గాడిద కష్టం చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే తనకు ఇప్పటికే సినిమా అవకాశాలు వస్తున్నాయని, కష్టమైనా తనకు నిర్మాణ రంగంలోనే ఎంతో బాగుందని.. ఇకపై సినిమాల్లో నటించనని ఛార్మి తెలియజేశారు.