TS RTC MD VC Sajjanar : కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడినట్లుగానే తెలంగాణలో, ఏపీలో ఆర్టీసీలపై కూడా ఎక్కువగా ప్రభావం పడింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీకి నష్టాలను తగ్గించేందుకు గాను మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.
ఆర్టీసీలో ప్రయాణికులు బస్సులను అద్దెకు తీసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, టూర్లకు గాను బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. అయితే ఇందుకు గాను ఇకపై సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన పనిలేదు. ఆ డిపాజిట్ అవసరం లేకుండానే బస్సులను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రజలకు కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు సజ్జనార్ వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు తమకు సమీపంలో ఉన్న డిపో మేనేజర్ను సంప్రదించవచ్చని సజ్జనార్ సూచించారు. లేదా 040-30102829, 040-68153333 అనే ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబరలకు కూడా కాల్ చేయవచ్చని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.