Ananya Pandey : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇప్పటికే ఎన్నో ఊహించని మలుపులు తిరిగింది. బుధవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్పై విచారించిన ముంబై కోర్టు అతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ వస్తుందని షారూఖ్ ఎంతగానో ఎదురు చూశారు. ఆఖరికి జైలు వద్ద వాహనాలను కూడా ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ చివరి నిమిషంలో ఎన్సీబీ కీలక ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టడంతో కేసు చాలా బలంగా ఉందని భావించిన కోర్టు ఆర్యన్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అయితే ఆర్యన్ ఖాన్కు చెందిన వాట్సాప్ చాట్లను ఎన్సీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఆర్యన్ పలువురితో డ్రగ్స్ విషయమై చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్యన్ పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తాడని.. ఆ చాట్స్ ద్వారా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. అందుకనే కోర్టు బెయిల్ ఇవ్వలేదని సమాచారం.
అయితే ఆర్యన్ ఖాన్ చాట్లలో ఒక హీరోయిన్తో చేసిన చాట్ల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆర్యన్ ఖాన్ షిప్పులో ఉన్నప్పుడు బాలీవుడ్కు చెందిన ఔత్సాహిక హీరోయిన్తో డ్రగ్స్ విషయమై వాట్సాప్ లో చాట్ చేసినట్లు తెలిసింది. అయితే ఆ హీరోయిన్ ఎవరా ? అని బుధవారం అంతా చర్చ జరిగింది. కానీ గురువారం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో ఎన్సీబీ సోదాలు నిర్వహిస్తుండడంతో.. ఆ హీరోయిన్ ఆమే అని స్పష్టమవుతోంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పవచ్చు.
ఇక అనన్య పాండే ఇంట్లో ఎన్సీబీ అధికారులకు ఏమైనా సాక్ష్యాలు లభిస్తాయా ? ఆమె ఫోన్ ను సీజ్ చేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. అనన్య ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే మూవీలో చేస్తోంది. దీనికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.