Manchu Vishnu Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలను ప్రకటించినప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక.. వివాదాలు తగ్గుతాయనుకుంటే.. ఇంకా పెరిగాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు అటు నరేష్, ఇటు ప్రకాష్ రాజ్లు దూషణల పర్వం మొదలు పెట్టారు. దీంతో చిలికి చిలికి ఈ వివాదం గాలి వానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అయితే గురువారం ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మా ఎన్నికల్లో తమ కుమారుడు మంచు విష్ణుకు మద్దతు తెలిపినందుకు గాను ధన్యవాదాలు చెబుతూ బాలకృష్ణను మోహన్బాబు కలిశారు. అయితే అదే సమయంలో.. అటు వైపు.. మంచు మనోజ్ పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ భీమ్లా నాయక్ షూటింగ్లో ఉన్నారు. దీంతో ఆయనను షూటింగ్ లొకేషన్లోనే మనోజ్ కలిశారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ? అనేది సస్పెన్స్గానే ఉంది. కానీ బుజ్జగింపులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తోంది.
ఎన్నికల రోజు మనోజ్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన పవన్తో కాసేపు సరదాగా గడిపారు. వారి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంది. దీంతో పవన్కు చెప్పి వివాదం లేకుండా సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించేందుకు మంచు ప్యానెల్ మనోజ్ను పంపించిందని అనుకోవచ్చు. పవన్ నచ్చజెబితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నాగబాబు ఇప్పటికే దురుసుగా మాట్లాడి మరింత దూరం పెంచారు. కానీ పవన్ మాట్లాడితే ప్రకాష్ రాజ్ వింటారు కనుక.. అటు నుంచి నరుక్కు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పవన్ను మనోజ్ సరదాగా కలిస్తే ఓకే. కానీ మా వివాదాన్ని సద్దుమణిగించేందుకు కలసి ఉంటే మాత్రం రానున్న రోజుల్లో వివాదాలకు బదులుగా ఆత్మీయ పలకరింపులను మనం చూడవచ్చు. మరి మా లో నెలకొన్న వివాదాలు మరికొద్ది రోజుల్లో సమసిపోతాయా ? లేదా ? అన్నది చూడాలి.