ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువతీ యువకులు పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కేవలం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా వికారాబాద్ కి చెందిన ఓ వివాహిత కేవలం తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో చెప్పిన మాట ప్రకారం బంగారం ఇవ్వలేదన్న కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత అనే యువతి, స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ లు రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో మమత తండ్రి తనకు మూడు తులాల బంగారం కానుకగా ఇస్తానని చెప్పాడు. తన పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నా తనకు బంగారం పెట్టకపోవడంతో ఇదే విషయం గురించి తన తల్లిదండ్రులను నిలదీసింది.
ఈ క్రమంలోనే మమత తండ్రి.. తన ఆరోగ్యం బాగాలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కానీ ఆలస్యం అయినా బంగారాన్ని కచ్చితంగా పెడతానని, అందుకు కొంత సమయం కావాలని కోరాడు. దీంతో తమ తల్లిదండ్రులు బంగారం ఇవ్వడం లేదని చెప్పి ఎంతో మనస్థాపానికి గురైన మమత విషపు గుళికలను మింగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ మమత మృతి చెందిందని.. వైద్యులు తెలిపారు.