కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వందలకొద్దీ లారీలు వరదలో చిక్కుకుపోయాయి. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అయితే అప్పటికే ఇసుక కోసం వందలాది లారీలు అక్కడ ఉండడంతో లారీలు మొత్తం వరద ఉధృతిలో చిక్కుకుపోయాయి.
ఈ వరద ఉధృతికి సుమారు 132 లారీలు కొట్టుకుపోవడంతో లారీ డ్రైవర్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫలంగా వరద ఉధృతి పెరగడంతో లారీలు వెనుదిరిగ లేక వరద ప్రవాహంలో చిక్కుకుపోయాయి. ఈ విధంగా లారీలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు,రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈక్రమంలోనే వరదల్లో చిక్కుకున్న ప్రొక్లెయిన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కూలీలను, క్లీనర్ లను అగ్నిమాపక సిబ్బంది పడవల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అలాగే వరదలో కొట్టుకుపోయిన లారీల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గితే తప్ప వరదల్లో చిక్కుకున్నటువంటి లారీలను బయటకు తీసుకు తీయలేమని అధికారులు తెలియజేయడంతో లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.