సాధారణంగా మనకు సూపర్ మార్కెట్లలో లభించని వస్తువు అంటూ ఉండదు. అన్ని రకాల వస్తువులతోపాటు ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు లభిస్తాయి. అయితే పండ్లు, కూరగాయలను మాత్రం ఎక్కడో తోటల నుంచి సూపర్ మార్కెట్లకు తరలించే సరికి కొన్ని రోజుల సమయం పడుతుంది. దీంతో అవి తాజాగా ఉండవు. పైగా అవి ఫ్రిజ్లో ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. ఒక్కసారి వాటిని బయటకు తీశాక వెంటనే పాడవుతాయి. దీంతో వినియోగదారులకు నష్టం, పర్యావరణానికి హాని కలుగుతాయి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకే ఆ సూపర్ మార్కెట్ వారు ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే..
కెనడాలోని మాంట్రియాల్లో 2017లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐజీఏ ఎక్ట్రా ఫమిలె డుషెమిన్ అనే గ్రాసరీ స్టోర్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సూపర్ మార్కెట్ పైభాగంలో యాజమాన్యం పంటలను పండించడం మొదలు పెట్టింది. వారు పైకప్పు మీద కొత్తిమీర, క్యారెట్లు, వంకాయలు, వెల్లుల్లి, టమాటాలు, పచ్చి మిరపకాయలు, పాలకూర వంటి కూరగాయలను పండించడం మొదలు పెట్టారు. ఇక తేనె కోసం ప్రత్యేక బాక్సులను కూడా ఏర్పాటు చేశారు.
దీంతో ఆ సూపర్ మార్కెట్పైన కూరగాయలు పండుతాయి. తేనె లభిస్తుంది. వాటిని కిందే ఉన్న సూపర్ మార్కెట్ లో విక్రయిస్తారు. దీంతో వినియోగదారులకు ఎప్పటికప్పుడు తాజాగా కూరగాయలు లభిస్తాయి. ఈ ఐడియా చాలా బాగా క్లిక్ అయింది. ఈ క్రమంలో ఆ సూపర్ మార్కెట్లో రద్దీ కూడా పెరిగింది.
ఇక వారు తమ సూపర్ మార్కెట్లో వృథాగా పోయే నీటిని రీసైకిల్ చేసి పంటలకు ఉపయోగిస్తారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తారు. దీని వల్ల స్వచ్ఛమైన, సహజసిద్ధమైన కూరగాయలు వినియోగదారులకు లభిస్తాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ క్రమంలోనే ఆ సూపర్ మార్కెట్ ను చూసి కొందరు అలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా వారి ఐడియా భలేగా ఉంది కదా..!