సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని, రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు శ్రమిస్తానని రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. సీఎం కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామన్నారు.
జూబ్లీ హిల్స్లోని క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను గద్దె దించితేనే అమరులు, రైతులు, నిరుద్యోగుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ తల్లికి తెరాస నుంచి విముక్తి కల్పించేందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు పీసీసీ పదవిని అప్పగించారని అన్నారు.
తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వగానే ప్రగతి భవన్ లో ప్రతిపక్ష నేతలకు తలుపులు తెరుచుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. యువ ప్రతినిధి ఉండాలనే ఆలోచనతోనే సీనియర్లతో చర్చించి అధిష్టానం తనకు ఈ పదవిని అప్పగించిందని అన్నారు. పేదల సమస్యలపై పోరాడేందుకు అవకాశం లభించిందని అన్నారు.