Simbu : తమిళ హీరో శింబు అస్వస్థతకు గురయ్యాడు. శింబుకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయనను హాస్పిటల్లో చేర్పించారు. ఆయన గత రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హాస్పిటల్లో చేరారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్కు చెందినవిగా అనిపిస్తున్నాయి. దీంతో ఆయనకు కోవిడ్ సోకిందేమోనని అనుమానిస్తున్నారు. కోవిడ్ కాకపోతే సాధారణ ఫ్లూ జ్వరం అయి ఉండే అవకాశం ఉంటుంది. ఏ విషయమూ వైద్య పరీక్షల అనంతరం తేలనుంది.
శింబు హాస్పిటల్లో చేరాడన్న సమాచారం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శింబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెందు తనిందదు కాడు అనే మూవీలో నటిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో విన్నై తాండి అనే మూవీ వచ్చింది. తెలుగులో దీన్ని నాగచైతన్య ఏ మాయ చేశావె పేరిట రీమేక్ చేసి హిట్ కొట్టాడు.
శింబు తెలుగులో మన్మథ, వల్లభ వంటి హిట్ చిత్రాలను విడుదల చేసి మంచి సక్సెస్ సాధించాడు. తరువాత పలు సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. దీంతో కొన్నేళ్ల పాటు శింబు కనిపించకుండా పోయాడు. అయితే ఇటీవలే తన కొత్త మూవీ ప్రెస్ మీట్ లో భావోద్వేగానికి గురయ్యాడు. తను ఇకపై అభిమానులకు దగ్గరగా ఉంటానని తెలిపాడు.