దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు వైరస్ వ్యాప్తిని కట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వాక్సిన్ పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి.సోషల్ మీడియాలో వచ్చే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ చిన్మయి స్పందించారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాదాలు తలెత్తుతాయనే తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. వాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని ప్రముఖ గైనకాలజిస్ట్ తో తను ప్రస్తావించానని దానిలో ఏ మాత్రం నిజం లేదని గైనకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత మంజుల అనగాని తెలిపారు అంటూ చిన్మయి పేర్కొన్నారు.
చిన్మయి చేసిన ఈ పోస్టుపై ఎంతోమంది మహిళలు స్పందించి, మేము కూడా నెలసరి సమయంలోనే వ్యాక్సిన్ వేసుకున్నాము. అయితే వ్యాక్సిన్ వల్ల తమకు ఎటువంటి సమస్య ఏర్పడలేదని వారు తెలియజేశారు. ఈ విధమైనటువంటి ముఖ్యమైన సమాచారం అందించినందుకు గాను చిన్మయికి మరికొందరు మహిళలు అభినందనలు తెలిపారు.