మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు శ్మశానానికి తరలిస్తారు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే క్రమంలో దింపుడు కల్లం ఉంటుంది. అక్కడ శవాన్ని కింద పెట్టి మూడు సార్లు చెవిలో పిలుస్తారు. చనిపోయిన తమ ఆత్మీయులు ఏదో ఒక అదృష్టం వల్ల బతికి వస్తారని ఆశ. అయితే చనిపోయిన వారు బతికిరారు, కానీ అలా పిలవడం ఒక ఆచారం. కానీ ఆ బాలుడు మాత్రం నిజంగానే అలా తిరిగి వచ్చాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా తన తల్లి పిలిచిన మాటలకు అతను స్పందించాడు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని బహదూర్గఢ్ ప్రాంతం అది. హితేష్, ఝాన్వి అనే దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దీంతో చికిత్స అందించారు. అయితే అతను చనిపోయాడు. మే 26న ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను మరణించాడని వైద్యులు నిర్దారించడంతో తల్లిదండ్రులు చేసేది లేక గుండెలవిసేలా రోదిస్తూ తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తరువాత అంత్యక్రియలు నిర్వహించేందుకు పూనుకున్నారు.
అయితే కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారనగా ఆ బాలుడి తల్లి ఆర్తనాదాలు చేసింది. ఒక్కసారి లేవరా కన్నా.. అంటూ పిలిచింది. అయితే అదృష్టవశాత్తూ ఆ బాలుడు స్పందించాడు. అతనిలో కదలిక వచ్చింది. దీంతో వెంటనే అతని తండ్రి అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించాడు. ఈ క్రమంలో బాలుడికి హాస్పిటల్లో చికిత్స అందించగా అతను కోలుకుని ఆరోగ్యవంతుడు అయ్యాడు. జూన్ 15న అతను డిశ్చార్జి అయ్యాడు. చనిపోయాడనుకున్న తమ కుమారుడు బతికి వచ్చే సరికి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.