ప్రస్తుతం సోషల్ మీడియాలో మమతా బెనర్జీకి సంబంధించిన ఓ పెళ్లి వార్త వైరల్ గా మారింది. జూన్ 15వ తేదీన మమతా బెనర్జీ పెళ్లి అంటూ వైరల్ గా మారిన ఈ పెళ్లి పత్రికలు చూసినా నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. అసలు ఏం జరిగిందంటే తమిళనాడుకు చెందిన ఓ యువ జంట పేర్లు మమతాబెనర్జీ,ఏఎం సోషలిజం కావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ శుభలేఖ నిజమైనదా కాదా అనే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో వరుడు తండ్రి లెనిన్ మోహన్ తెరదించారు. ఈ శుభలేఖ వాస్తవమేనని తెలిపారు.
సేలం జిల్లా సీపీఐ కార్యదర్శి లెనిన్ మోహన్.. తన కుమారులు సహా వధువు పేర్లు ఆ విధంగా పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. కేవలం కమ్యూనిజంపై ఉన్న అభిమానంతోనే కుమారులకు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం అనే పేర్లు పెట్టినట్టు ఆయన తెలిపారు. తన స్వగ్రామం కత్తూరులో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని అభిమానిస్తారని.. అందుకే తన పిల్లలకు ఈ విధమైనటువంటి పేర్లు పెట్టానని తెలిపారు.
ఇక వధువు విషయానికి వస్తే ఆమె కూడా తమ సమీప బంధువు అమ్మాయి అని ఆమె తాతయ్య కాంగ్రెస్ పార్టీ నేత అని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని స్ఫూర్తిగా తీసుకొని తన మనవరాళ్లకు ఆ విధంగా పేరు పెట్టినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే వీరిరువురు పెళ్లి జూన్ 15వ తేదీన జరపాలని నిర్ణయించడంతో ఈ పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈక్రమంలోనే ఇది నిజమా ?కాదా ? అని తెలుసుకోవడం కోసం మూడు రోజుల నుంచి స్నేహితులు బంధువులు మీడియా నుంచి సుమారుగా 300 ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.